Share News

కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్

ABN , Publish Date - Jun 28 , 2026 | 08:59 PM

కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి ఘటనలో పాక్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికింది.

కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్
MEA Spokesperson Randhir Jaiswal

ఇంటర్నెట్ డెస్క్: కరాచీలోని మిలిటరీ స్థావరంపై దాడి ఘటనలో పాక్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇతరులను వేలెత్తి చూపే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద మూకలను కట్టడి చేసుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా చూడటం మానుకోవాలని అన్నారు.


కరాచీలోని సింధ్ రేంజర్స్ మిలిటరీ కాంపౌండ్‌పై శనివారం కొందరు సాయుధులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు పాక్ పారా మిలిటరీ సిబ్బంది మరణించారు. మిలిటెంట్లు వాహనంతో గేటు బద్దలు కొట్టుకుని లోపలకు దూసుకెళ్లారు. గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ కమాండోలు దాదాపు 90 నిమిషాల పాటు శ్రమించి వారిని అంతమొందించారు. ఈ ఘటనలో ఆరుగురు మిలిటెంట్లు మరణించారని పాక్ భద్రతా దళాలు తెలిపాయి. ఒక మిలిటెంట్‌‌ను బంధించామని చెప్పారు.

ఈ ఘటనకు తామే బాధ్యులమని నిషేధిత తెహ్రీక్ ఏ తాలిబాన్ అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ పేర్కొంది. పాక్ భద్రతా దళాలు, ప్రభుత్వ భవనాలపై గతంలో జరిగిన అనేక దాడుల వెనుక ఈ సంస్థే ఉంది. 2024 అక్టోబర్‌లో కరాచీ ఎయిర్‌పోర్టుపై జరిగిన ఉగ్రదాడి తరువాత ఆ స్థాయిలో మరోదాడి జరగడం పాక్‌లో ఇదే తొలిసారి. 2024 నాటి దాడిలో ఇద్దరు చైనా ఇంజనీర్లు మరణించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

రామమందిర నిధుల దుర్వినియోగం.. సంపన్నులుగా మారిన నిందితులు!

ముందు చేసేయాలి.. ఆ తర్వాతే అందరికీ చెప్పాలి: శుభాంశు శుక్లా

Updated Date - Jun 28 , 2026 | 09:09 PM